12వ వార్డులో ఓట్ల వివరాలు సేకరిస్తున్న టీడీపీ శ్రేణులు(ఫైల్)
ప్రకాశం : ‘మేం ఓట్ల సర్వే చేస్తున్నపుడు వచ్చి ప్రశ్నిస్తే తలకాయ పగులుద్ది’ అంటూ ఓ విలేకరిని దర్శికి చెందిన స్థానిక టీడీపీ మహిళా నాయకురాలు శోభారాణి బహిరంగంగా హెచ్చరించారు. దర్శి నగర పంచాయతీ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ దౌర్జన్యకాండ వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎల్ఐసీ బజారులో కొందరు టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలు, వారు ఏ పార్టీకి ఓటు వేస్తారనే సమాచారాన్ని సేకరించి ‘మై టీడీపీ’ యాప్లో నమోదు చేస్తున్నారు.
దీన్ని ప్రశ్నించిన విలేకరిపై వారు ఈ విధంగా బెదిరింపులకు దిగారు. అదేవిధంగా 17వ, 12వ వార్డుల్లోనూ బయటి ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఓటర్ల వివరాలు అప్లోడ్ చేస్తుండగా స్థానిక మహిళలు, వైఎస్సార్సీపీ బీఎల్ఏలు నిలదీశారు. వారినీ బెదిరించే యత్నం చేసిన టీడీపీ శ్రేణులు.. జనం తిరగబడటంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు ఈఆర్ఓ, కమిషనర్లకు తెలియజేస్తున్నా వారు టీడీపీ కార్యాలయం నుంచి వచ్చామని చెప్పగానే చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతుండటం గమనార్హం.
అధికార బలంతో ఓట్ల తొలగింపు కుట్ర
ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రకు టీడీపీ తెరతీసింది. ఇందులో భాగంగానే ఇళ్ల వద్దకు వెళ్లి కులం, ఓటు వేసే పార్టీ తదితర వివరాలను సేకరించి యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ఓటు దొంగలు వచ్చి బహిరంగంగా ఈ తంతు సాగిస్తున్నారు. దీనిపై స్థానికులు ఈఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదు. సర్వే చేస్తున్నది టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన వారు కావడంతో.. వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటా
ఇంటికి వెళ్లి ఓట్ల వివరాలు అడిగేందుకు బీఎల్ఓలకు మాత్రమే అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా వెళ్లి ఓట్లు వివరాలు అడిగితే తే చర్యలు తీవ్రంగా ఉంటాయి. నియోజకవర్గంలో మాకు తెలిసి ఎవరికీ ఎలాంటి సర్వేలు చేయడానికి అనుమతులు లేవు. విచారించి ఇలాంటి సర్వే చేస్తే చర్యలు తీసుకుంటాం.
– శాంతిలక్షి్మ, ఈఆర్ఓ


