సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్లో రోజురోజుకూ రాజుకుంటున్న టికెట్ల పంచాయితీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాందీనే స్వయంగా రంగంలోకి దిగారు. కుల సమీకరణలు, రాజకీయ అనుభవం, వలసవాదులు, కాంగ్రెస్ వాదులు, సీనియర్లు, జూనియర్లు అంటూ రోజుకోవాదం తెరపైకి వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక తీరుతెన్నులపై రాహుల్ గాంధీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సహా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నుంచి రాహుల్ వివరాలు సేకరించారు. తెలంగాణలో పార్టీ గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ఉండాలనే సంకేతాలను రాహుల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చేరికలపై సమాలోచనలు...
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సహా ఆయన కుమారుడు మైనంపల్లి రోహి త్ కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో అదే స్థానంలో టికెట్ కోరుతున్న సీనియర్ నేత నందికంటి శ్రీధర్ను వెంటపెట్టుకొని రాహుల్ గాంధీ వద్దకు వెళ్లిన రేవంత్రెడ్డి ఆయనతో విడిగా భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితు లు, కొత్త చేరికల అంశంపై చర్చించారు. సగానికిపైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీలో తలెత్తిన భిన్నాభిప్రాయాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరాన్ని రేవంత్ నొక్కిచెప్పినట్లు సమాచారం.
అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్లోకి వస్తున్న నేతలకు టికెట్ల విషయంలో సమతౌల్యం లోపిస్తే పార్టీ గెలుపు అవకాశాలకు భారీగా గండి పడుతుందన్న విషయాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది. ఇక సామాజిక న్యా యం జరిగేలా బీసీలకు టికెట్ల కేటాయింపు అంశం సైతం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు స మాచారం. ముదిరాజ్, గౌడ, యాదవ వర్గానికి అధిక టికెట్లు ఇచ్చేలా అభ్యర్థుల ఎంపిక ప్రక్రి య కొనసాగిస్తున్నామని, బీఆర్ఎస్కన్నా కనీసం 6 నుంచి 8 టికెట్లు అధికంగా ఇచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు రేవంత్ వివరించారు.
ఈ భేటీ అనంతరం నియోజకవర్గాలవారీగా అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్నికల వ్యూహక ర్త సునీల్ కనుగోలు రేవంత్రెడ్డితో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో రాహు ల్ సైతం పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నియోజకవర్గాలవారీగా పార్టీ అభ్యర్థుల గెలుపోటముల అంశాన్ని సునీల్ వివరించారు. ఇతర అంశాల జోలికి వెళ్లకుండా గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక ఉండాలని రాహుల్ వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.
రాజకీయ భవిష్యత్తుకు మాది భరోసా...
మైనంపల్లి చేరికతో టికెట్ కోల్పోతున్న నందికంటి శ్రీధర్కు రాహుల్ గాంధీ స్వయంగా భరోసా కల్పించినట్లు సమాచారం. భవిష్యత్తులో పార్టీ పదవుల్లో మంచి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక మెదక్ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వచ్చినా ఎవరినీ కలవకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది.


