చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టీవీకే పార్టీకి చెందిన ఉత్తంగరై ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాను రూ.35 కోట్ల భారీ లంచంతో ప్రలోభపెట్టి, క్రాస్ ఓటింగ్కు పాల్పడేలా చేయడానికి ఒక ముఠా ప్రయత్నించింది. దీనిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు ఈ కుట్రతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని (క్రాస్ ఓటింగ్), ఇందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్లు ఇస్తామని ఎమ్మెల్యే ఇళయరాజాకు ఆఫర్ వచ్చింది. ఒక పొలిటికల్ సర్వే సంస్థ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ఈ డీల్ మాట్లాడారు. మొత్తం 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడమే వీరి ప్రధాన లక్ష్యమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ రూ.35 కోట్ల లంచం ఆఫర్ వెనుక డీఎంకే అగ్రనేత, మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి కనుసన్నల్లోనే ఈ ఆపరేషన్ జరిగినట్లు నిఘా వర్గాల ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యాయి. ఆఫర్ను తిరస్కరిస్తే ఎమ్మెల్యేను, ఆయన కుటుంబాన్ని చంపేస్తామని నిందితులు బెదిరించారు.
బెదిరింపులు రావడంతో ఎమ్మెల్యే ఇళయరాజా వెంటనే చెన్నై పోలీస్ కమిషనర్ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను (తిరునావుక్కరసు, నరేష్, త్యాగరాజన్) అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఈ ‘హార్స్ ట్రేడింగ్’(ఎమ్మెల్యేల కొనుగోలు) వ్యవహారం బయటపడటంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది.


