ఓదెల: దక్షిణ మధ్య రైల్వేలోని కాజీపేట – బల్హార్ష సెక్షన్ల మధ్య సమయానకూలంగా రైళ్లు రాకపోకలు సాగించేందుకు వీలుగా రైల్వే శాఖ చేపట్టిన ఆటో సిగ్నల్స్ వ్యవస్థ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం ఉద్దేశించిన రైల్వేస్టేషన్ల సమీపంలో ఏబీఎస్ హట్ల నిర్మాణంలో వేగం పెంచింది. మూడో రైల్వేలైను పనులు పూర్తయ్యాక రైళ్లను మరింత వేగవంతంతోపాటు సకాలంలో గమ్యం చేరుకునేలా ఆటో సిగ్నల్స్ సిస్టమ్ను రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కిలోమీటరుకో ఆటో సిగ్నల్స్ సిస్టమ్
ప్రతీ కిలోమీటర్కు ఆటో సిగ్నల్స్ సిస్టం, ప్రతీ రెండు కిలోమీటర్ల నిడివితో ఒకటితర్వాత మరోరైలు పరుగులు పెట్టేలా చూడడమే ఆటోసిగ్నల్స్ సిస్టం లక్ష్యం. దీనికోసం కాజీపేట నుంచి బల్హార్షా మధ్య కొలనూర్, కొత్తపల్లి, ఓదెల, చీకురాయి, జమ్మికుంట, హసన్పర్తి, రామగుండం, రాఘవపూర్ నుంచి ప్రతీ నాలుగు కిలోమీటర్ల దూరంతో ఏబీఎస్ హట్ల నిర్మాణం చేపట్టింది. రెడీమేడ్గా రూపొందించిన హట్లో కంప్యూటర్ సిస్టం అమర్చారు.
మందమర్రి– రామగుండం, హసన్పర్తి – జమ్మికుంట..
ప్రస్తుతం ఆటో సిగ్నల్స్ సిస్టం ఆధారంగా మందమర్రి – రామగుండం, హసన్పర్తి – జమ్మికుంట మధ్య రైళ్లు పరుగెత్తుతున్నాయి. మిగతా రైల్వేస్టేషన్లను అనుసంధానం చేస్తూ రైలుపట్టాలకు ఇరువైపులా ఆటోసిగ్నల్స్ కోసం గుంతలు తవ్వుతున్నారు. కేబుల్ పనులనూ శరవంగా చేస్తోంది. వాగులపై వంతెనలు, మానేరు, గోదావరి బ్రిడ్జిపై కూడా ఆటోసిగ్నల్ సిస్టంతో పాటు ఏబీఎస్ హట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న రైళ్ల రద్దీకి అనుగుణంగా సమయపాలన పాటించడం కోసం అమలు చేస్తున్న సిగ్నల్స్ సిస్టం సత్ఫలితాలు ఇస్తోందనిఫ రైల్వేసిబ్బంది తెలిపారు. కాజీపేట – బల్హార్షాతోపాటు సికింద్రాబాద్ – వరంగల్ – రాజమండి మధ్య కూడా కొత్త విధానం అమలు చేస్తున్నారు.


