కోల్సిటీ: రామగుండం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీ, రాజ్యలక్ష్మీ కాలనీల్లో అభివృద్ధి పనులన్నీ దశల వారీగా పూర్తిచేస్తామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రాజ్యలక్ష్మీకాలనీలో రూ.7 కోట్ల ప్రత్యేక నిధుల ప్యాకేజీలో భాగంగా రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేఏపట్టిన సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవితో కలిసి మేయర్ సోమవారం ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఇచ్చిన హామీ మేరకు రాజ్యలక్ష్మీ, సప్తగిరికాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురికాకుండా వరద నీటికాలువ నిర్మించామన్నారు. కొత్తకాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు రోడ్లపై వస్తోందని, ప్రస్తుతం డ్రైనేజీ నిర్మాణం పూర్తయిందని, ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. ఇటీవల వార్డు సందర్శన నిర్వహించి ప్రజల సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ డివిజన్ను అభివృద్ధి చేస్తామని మేయర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, డేవిడ్ రాజు, నాయకులు గడ్డం శ్రీనివాస్, పీచర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


