విజయనగరం టౌన్: విఘ్న నాయకునికి పూజలు నిర్వహించే వారంతా విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అడుగడుగునా ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ ఉద్యోగి సమాచారాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. నిఘా నేత్రంతో నిశిత పరిశీలన చేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది.
మండపాలు ఏర్పాటు చేసే వారందరూ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మండపం వద్ద ఎల్లప్పుడూ నిర్వహకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సమయాల్లో ప్రజలు మండపం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైన చోట మండపం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచాలి. లౌడ్ స్పీకర్లు, డీజేలు ఉపయోగించేటప్పుడు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. విగ్రహ ఊరేగింపు నిర్వహించే ముందు పోలీసు శాఖకు సమాచారమందించి, వారు సూచించిన మార్గం, సమయాన్ని మాత్రమే పాటించాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి వినాయక మండపానికి నిర్వహకులు ఒక బాధ్యత గల వ్యక్తిని నోడల్ పర్సన్ను నియమించాలి. మొబైల్ నెంబర్, పూర్తి వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్కు ముందుగానే అందజేయాలి.
నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు
అసాంఘిక కార్యకలాపాలకు తావీయ్యొద్దు
అడుగడుగునా నిఘా నేత్రం : ఎస్పీ దామోదర్
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరి మనోభావాలు దె దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటూ ప్రత్యేకంగా నిఘా నేత్రంతో పరిశీలన చేస్తుంటుంది. మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉచితంగా తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్ 112/100కి సమాచారమివ్వాలి.
– ఏఆర్ దామోదర్, ఎస్పీ


