● ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం రూ.250 పైనే..
పార్వతీపురం: వంటింట్లో ఏ కూర వండాలన్నా అల్లం తప్పనిసరి. అలాంటి అల్లం కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి వారు అమ్మో.. అంత ధర అని.. విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల నుంచి అల్లం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో అల్లం ధర రూ.250ల నుంచి రూ.280 వరకు పలుకుతోంది. దీంతో అల్లం కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అల్లం సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిచేసుకునే అల్లం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. హోల్సేల్ వ్యాపారుల నుంచి రూ.230లకు కొనుగోలు చేసుకొని చిరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా అల్లం పంట చేతికి రాకపోవడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే బాటలో ఉల్లి, వెల్లుల్లి ధరలు దూసుకుపోతున్నాయి.


