జియ్యమ్మ వలస రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి పిలుపునిచ్చారు. అప్పుడే గ్రామ స్వరాజ్యానికి, పార్టీకి మనమిచ్చే గౌరవమన్నారు. చినమేరంగిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షత్ రాజు ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ముఖ్యనేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మోసాలను ఎండగట్టాలి..
2024 ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి 143 దొంగ హామీలతో చంద్రబాబు గెలుపొందారు. అనంతరం వాటి అమలును గాలికొదిలేశారు. ఈ మోసాలను ప్రజలకు వివరంగా తెలియజెప్పాలి. అందులో భాగంగానే గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు అందించిన పథకాల గురించి ప్రజలకు గుర్తు చేయాలి. నిరుద్యోగ యువత, రైతులు, విద్యార్థులు, మహిళలకు చేసిన మోసాలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు సూచించారు.
దీటైన వారే నిలబడాలి..
‘ఐదు మండలాల్లోని అన్ని పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ తరఫున దీటైన అభ్యర్థులను బరిలో దించాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల స్థానాలు గెలిపించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా జరి గిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు, బెదిరింపులకు తలొగ్గొద్దు. అలాంటి వాటిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని’ నేతలు పిలుపునిచ్చారు.
సైనికుడిలా కష్టించాలి..
‘ప్రతి కార్యకర్త సైనికుడై వైఎస్సార్సీపీ కోసం కష్టపడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి. కూటమికి ఓటమిని చూపించే విధంగా ప్రతి కార్యకర్త నిలబడాలి. పార్టీలో అంతర్గత కలహాలు తావివ్వకూడదు. ఎవరికై తే పార్టీ బీ–ఫారంను అందిస్తుందో వారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా భావించి గెలిపించాలి. ఈ రోజు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంగా భావిస్తాం. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి అన్నివిధాలా అండగా ఉంటామని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్రాజు ధైర్యం చెప్పారు.
వైఎస్సార్సీపీతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం
‘స్థానిక’ సమరానికి సిద్ధం కావాలని పరీక్షిత్ రాజు పిలుపు
కార్యకర్తల బలమే పార్టీ విజయమని పుష్పశ్రీవాణి వ్యాఖ్య


