విజయనగరం టౌన్:
సిరులతల్లి పైడితల్లి పండగ వస్తుందంటే అందరికీ ఆనందమే. ఆ తల్లి కరుణా, కటాక్ష వీక్షణాల కోసం ఎందరో భక్తులు వేచిచూస్తుంటారు. సిరిమానును చూసి ఆ తల్లి ఆశీర్వాదం పొందుతారు. జీవితంలో ఒక్కసారైనా అమ్మజాతరను చూడాలని పరితపిస్తుంటారు. అంతటి ప్రాశస్త్య్రం కలిగిన పైడితల్లి నెలరోజుల పండగ తేదీలు ఖరారయ్యాయి. రాష్ట్రపండగకు అధికారయంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. పైడితల్లి అమ్మవారి కార్యాలయం ఆవరణలో ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన వివరాలను దేవదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష సోమవారం వెల్లడించారు.
అక్టోబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు జాతర
అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 11 వరకూ నెలరోజుల పండగ సాగనుంది. అక్టోబర్ 1న గురువారం ఉదయం 8 గంటలకు చదురుగుడి వద్ద మండల దీక్షలు ప్రారంభమవుతాయి. అనంతరం అదేరోజు చదురుగుడి ఆవరణలో 9.30 గంటలకు, వనంగుడి ఆవరణలో ఉదయం 11 గంటలకు పందిరిరాట వేసి ఉత్సవాలు ప్రారంభిస్తారు. అక్టోబర్ 22న గురువారం అర్ధమండల దీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 26న సోమవారం తొలేళ్ల ఉత్సవం, 27న మంగళవారం సిరిమానోత్సవం నిర్వహణకు తేదీలు ఖరారు చేశారు. నవంబర్ 3న మంగళవా రం పెద్దచెరువులో అమ్మవారి తెప్పోత్సవం, 7న శనివారం సాయంత్రం 5.30 గంటలకు రైల్వేస్టేషన్ వద్ద వనంగుడి నుంచి అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపు, 10న మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల మహోత్సవం, 11న బుధవారం వనంగుడి ఆవరణలో చండీహోమం, పూర్ణాహుతి, దీక్షావిరమణలు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని ఈఓ తెలిపారు. పండగ షెడ్యూల్ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ట్రస్టు బోర్డు సభ్యులు కె.ఠామేశ్వరరావు, డి.కృష్ణమూర్తి, కె.గోపాలరెడ్డి, పి.రామయ్య పంతులు, ఎల్.స్వాతి కుమారి, ఎల్.కుమారి, వి.వెంకటలక్ష్మి, కె. తులసి, డి.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1 నుంచి మండల దీక్షలు,
పందిరిరాటతో ప్రారంభం
అక్టోబర్ 26న తొలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవం
ఉత్సవ వివరాలు వెల్లడించిన ఆలయ ఈఓ కె.శిరీష


