● వెదురు కంజి..ఎంతో ప్రీతి
● మన్యం వంటకాల్లో ఒకటి
● చిగుళ్ల సేకరణలో గిరిజనులు బిజీ
గుమ్మలక్ష్మీపురం: మన్యం వంటకాల్లో ఈ సీజన్లో లభ్యమయ్యే వెదురు కంజి కూర ప్రత్యేకం. వెదురు చిగుళ్లను సేకరించి కూర తయారు చేసుకుని మన్యం వాసులు ఎంతో ప్రీతిగా తింటారు. వాటిని వెదురు కంజి లేదా వెదురు కొమ్ములు అని కూడా పిలుస్తారు.
ఆహారం..ఆదాయం
ప్రస్తుత సీజన్లో వెదురు చిగుళ్లు ఏపుగా వస్తున్నాయి. వాటిని సేకరించిన గిరిజనులు విక్రయించి ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం వాటి అమ్మకాలు వారపు సంతల వద్ద జోరుగా సాగుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోని వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి వాటి నుంచి చిగురును సేకరించి, శుభ్రం చేసి ముక్కలు చేసి వాటా సైజును బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు అమ్ముతున్నారు.
రెండు రకాలుగా కూర తయారీ
వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. వచ్చి వెదురు కంజిని ఒక రకంగా, ఎండబెట్టిన వెదురు కంజిని మరో విధంగా కూర తయారు చేస్తారు. పచ్చిగా ఉన్నప్పుడు వెంటనే కూర తయారు చేసుకోవాలి. ఎండబెట్టుకుంటే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర తయారీకి వినియోగించవచ్చని గిరిజనులు చెబుతున్నారు. వెదురు కంజిని వేపుడు, పచ్చడి, పులుసు ఇలా రకరకాలుగా తయారు చేసుకుని తింటామని పేర్కొంటున్నారు. కూర తయారీకి ముందు రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుందని గిరినులు తెలిపారు.
ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
వెదురుకొమ్ముల కూర తినడం వల్ల మధుమేహం, కఫం, మూల వ్యాధి నివారణతో పాటు రక్తశుధ్ధి జరుగుతుందని, గర్భకోశ వ్యాధుల నివారణ జరుగుతుందని గిరిజనులు నమ్ముతున్నారు. వెదురు కంజిని పేస్ట్గా తయారు చేసి గాయంపై రాయడం వల్ల త్వరగా మానుతుందని చెబుతున్నారు.


