రీసర్వే పూర్తయినా..
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో
కనిపించని వివరాలు
● రెండేళ్లుగా రైతుల అవస్థలు
● కొందరికి అందని పాస్ పుస్తకాలు
బలిజిపేట: రీ సర్వే ప్రక్రియ పూర్తయింది.. అయినా పలు గ్రామాల భూముల వివరాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కనిపించడం లేదు.. దీంతో ఆయా గ్రామాలకు చెందిన భూములు క్రయ విక్రయాలు జరగడం లేదు. దీంతో ఆ గ్రామాల రైతులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తమ భూములను విక్రయించి కష్టాల నుంచి గట్టెక్కుదామంటే కుదరడం లేదు. రెండేళ్లుగా ఇలా సమస్య నలుగుతూనే ఉంది తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇటు పాలకులుగాని.. అటు అధికారులుగాని దీన్ని పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదని ఆ రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...
బలిజిపేట మండలం పలగర, తుమరాడ, వెంగాపురం, శివరాంపురం గ్రామాలకు చెందిన రైతుల భూములు రిజిస్ట్రేషన్లు జరగక క్రయ, విక్రయాలకు నోచుకోవడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద పోర్టల్లో రీసర్వేకు సంబంధించిన వివరాలు కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఓ వైపు రీసర్వే పూర్తయింది. పాస్ పుస్తకాలు కూడా కొద్ది మందికి తప్ప అందరికీ వచ్చేశాయి. అయితే వాటిలో తప్పులు సరి చేసుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే సరిగా ఉన్న వారి భూములను క్రయ విక్రయాలు జరపాలంటే కుదరడం లేదు. దీంతో అత్యవసర ఖర్చుల నిమిత్తం భూములను అమ్ముదామంటే కుదరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వే పూర్తయి రెండేళ్లు అవుతున్నా.. ఈ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్వేకు సంబంధించి అధికారులు చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా తమ భూములు క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.


