నెల్లిమర్ల రూరల్: మండలంలోని కొండగుంపాం గ్రామానికి చెందిన తుమ్మలపేట పీఏసీఎస్ డైరెక్టర్ పతివాడ గోవింద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సారిపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పల్సర్ బైక్ వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి, అనంతరం విజయనగరంలో మరో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోవింద్ మృతితో స్వగ్రామమైన కొండగుంపాంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే నాగమాధవి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మార్కెఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, తదితరులు గోవింద్ పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పక్కిలో ఏనుగుల గుంపు
బొబ్బిలి రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చిన ఎనిమిది ఏనుగుల గుంపు బొబ్బిలి, తెర్లాం, మెరకముడిదాం మండలాల్లోని పంట చేలు, మొక్కజొన్న, చెరుకు పంటలను నాశనం చేస్తున్నాయి. శనివారం పక్కి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నాయి. అక్కడే ఉన్న ఓ మామిడి తోటలో తిష్టవేశాయి. గత రెండు రోజులుగా మండలంలోని రాముడువలస, శివడవలస, పక్కి పరిసర ప్రాంతాల్లోని వరినారు, మొక్కజొన్న పంటలను నాశనం చేశాయి. ఏనుగుల గుంపును ఇక్కడి నుంచి సీతానగరం మండలం జోగింపేట ఎలిఫెంట్ జోన్కు తరలించేందుకు కుంకీ ఏనుగును శనివారం పక్కి గ్రామానికి తీసుకువచ్చారు. ఆ కుంకీ ఏనుగు ద్వారా ఏనుగుల గుంపును తరలించేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.
విద్యుత్ షాక్కు గురై ఆవు మృతి
మెరకముడుదాం: మండలంలోని చిన బంటుపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ షాక్కు గురై పాడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పల్లి లక్ష్మీనారాయణ ఆవులు మేస్తుండగా గ్రామానికి తాగునీటి సరఫరా చేస్తున్న బోరుబావి ప్యానెల్ బోర్డు విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు ఆవుకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో లక్ష్మీనారాయణ తనకు జీవనాధారమైన రూ.50 వేల విలువ చేసే ఆవు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని బోరున విలపిస్తున్నాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.


