విజయనగరం గంటస్తంభం: బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా యూటీఎఫ్ తరఫున కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా రంగాన్ని సంరక్షించడం యూటీఎఫ్ బాధ్యతని అన్నారు. ఉపాధ్యాయుల 12వ వేతన సంఘం నియామకం సహా ఆర్థిక డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించాలని సూచించారు. డిమాండ్ల సాధనకు మార్చి 24న నియోజకవర్గ కేంద్రాల్లో, ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో, ఏప్రిల్ 15 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో నిరాహార దీక్షలు, ఏప్రిల్ 28న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


