పార్వతీపురం: సీతానగరం మండలంలోని కోట సీతారాంపురంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించి తద్వారా అధిక రాబడులను పొందేలా ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించి ప్రోత్సహించాలన్నారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారిచే కొత్త పరిశ్రమల ను స్థాపించేలా తోడ్పాటును అందించాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.
మార్ట్తో అభివృద్ధికి ముందడుగు
జిల్లాలో మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్ఫార్మేషన్ (మా ర్ట్) ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా అభివృద్ధిలో ముందడుగు వేయనుందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. రైతులు, మహిళలు ఆదాయం రెట్టింపు కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు పంట మార్పిడి చేసి ఆధునిక పద్ధతులను అవలంభించాలన్నారు. రైతుల తలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా మార్ట్ పని చేస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల్లో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీయాలన్నారు.
రీసర్వేను వేగవంతం చేయాలి
జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వే, పట్టాదారు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. అమరావతి నుంచి కలెక్టర్లు, జేసీలు, డీఆర్ఓలు, ఆర్డీలతో సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి జి.జయలక్ష్మి బుధవారం సమీక్షించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నిషేధిత జాబితాలో వున్న భూమి వివరాలను గుర్తించాలన్నారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులకు సూచించారు.


