మేము అప్పుచేస్తాం...
రాజాం సిటీ:
‘విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు మేము అప్పుచేస్తున్నాం.. దానికి అయ్యే వడ్డీ 7.5 శాతం భారాన్ని కళాశాలల యాజమాన్యాలే భరించాలి.. అలా అయితేనే 2024–25 సంబంధించి ఆర్టీఎఫ్లు విడుదల చేస్తాం... మీకు చెల్లించాల్సిన మొత్తంలో 7.5 శాతం వడ్డీ మినహాయించి మిగిలినది కళాశాల బ్యాంకు ఖాతాలకు జమచేస్తాం.. దీనికి మీరు అగ్రిమెంట్ ఇవ్వాలి.. దీనికి సమ్మతమైతే ఆర్టీఎఫ్ విడుదల అవుతుంది.’ అంటూ ఇటీవల రౖపైవేటు కళాశాలల అసోసియేషన్ సభ్యులు సంప్రదించిన సమయంలో సీసీఈ సభ్యుడు భరత్గుప్తా చెప్పిన మాట. దీనిపై ప్రైవేటు కళాశాలల అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే రెండేళ్లుగా వడ్డీలకు అప్పులుతెచ్చి కళాశాలలు నిర్వహిస్తున్న సమయంలో ఆర్టీఎఫ్లు విడుదలకు తెచ్చిన సొమ్ముకు 7.5 శాతం వడ్డీ చెల్లించాలంటే కష్టమని, ఇలా అయితే కళాశాలల యాజమాన్యాలు నష్టపోతాయని తేల్చిచెప్పామనే విషయాన్ని అసోసియేషన్ సభ్యులు వాట్సాప్ గ్రూపుల ద్వారా మిగతా కళాశాలల యాజమాన్యాలకు వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. గత ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసేదని, వారు ఫీజులు చెల్లించేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందంటూ ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కారు నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే ఆర్టీఎఫ్ నిధులు జమచేస్తామని చెప్పి ఇప్పుడు ఈ మెలిక పెట్టడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో ఉన్న సుమారు 35 ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 20వేల మంది, 11 ఇంజినీరింగ్ కళాశాలల్లో 15వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కళాశాలలకు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తుందన్న భరోసాతో విద్యార్థులు ఆయా కళాశాలల్లో చదువుకుంటున్నారు. విద్యాసంవత్సరం ముగిసే సమయం దగ్గరపడుతున్నా ఇంత వరకు చంద్రబాబు సర్కారు కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదు. దీంతో అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటు కళాశాలలకు చంద్రబాబు సర్కారు సరికొత్త ఆఫర్
7.5 శాతం వడ్డీ చెల్లిస్తేనే
ఫీజురీయింబర్స్మెంట్ విడుదల!
అప్పుతెచ్చిన నిధులకు కళాశాలలే
వడ్డీ చెల్లించాలని మెలిక
నిధుల విడుదలలో జాప్యం
దిక్కుతోచని స్థితిలో కళాశాలల
యాజమాన్యాలు


