● చంద్రన్న పింఛన్ గొప్పలు.. లబ్ధిదారులకు తప్పని తిప్పలు!
● అర్హులకు మంజూరుకాని పింఛన్
● అధికారులచుట్టూ ప్రదక్షణలు
పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలస గిరిజన గ్రామానికి చెందిన ఈ వృద్ధ దంపతుల పేర్లు కొర్రా తిరునాథ, చిన్నమ్మి. 70 ఏళ్లకుపైగా వయస్సున్న తిరునాథకు గతంలో పింఛన్ అందేది. వీరి ఇంట్లోనే వితంతువుగా ఉన్న కోడలు ఉండటం.. ఆమెకు కూడా వితంతు పింఛను రావడంతో ఈయన లబ్ధిని నిలిపివేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి పింఛనే ఆధారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నడవలేడు, కూర్చోలేడు. ఎన్నోమార్లు పింఛన్ కోసం అడిగాడు. పోనీ, తన భార్యకు అయినా లబ్ధి కలిగించాలని ప్రాథేయపడ్డాడు. కొత్త పింఛన్లేవీ మంజూరు కాకపోవడంతో వీరి మొర వినేవారే లేకపోయారు.
ఈ చిత్రంలోని మహిళల పేర్లు చొక్కాపు పార్వతి, పాపమ్మ. సాలూరు మండలం అన్నంరాజువలస పంచాయతీ రెయ్యివానివలస గ్రామం. కొన్ని నెలల కిందట వీరి భర్తలు చనిపోయారు. అప్పటి నుంచి జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భర్త పెన్షన్ ఇప్పించాలని ఎన్నోమార్లు అధికారులను కలిసి వేడుకున్నారు. ఇప్పటికీ మంజూరు కాలేదు. అధికారులు దయతలచి తమకు న్యాయం చేయాలని ప్రాథేయపడుతున్నారు.


