గుంటూరు లీగల్: లోక్ అదాలత్ కార్యాలయం, జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి, పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్, జూనియర్ డివిజన్) పాల్గొన్నారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో 80 మొక్కలు నాటారు.
నగరంపాలెం: స్థానిక గుంటూరు రేంజ్ ఐజీ బంగ్లాలో 80వ స్వాతంత్య్ర దిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. రిజర్వ్ సిబ్బంది నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర విశిష్టతను తెలియజేసి, పోలీస్ అధికార, సిబ్బందికి మిఠాయిలు అందించారు. క్యాంప్ కార్యాలయం, ఐజీ బంగ్లా సిబ్బంది, రిజర్వ్ గార్డ్లు జాతీయ గీతాన్ని ఆలపించారు. పోలీస్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన గుంటూరు ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) డాక్టర్ కె.శ్రీనివాసులు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. శనివారం జరిగిన 80వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మల చేతుల మీదుగా శ్రీనివాసులు ప్రశంసాపత్రాన్ని, అవార్డును స్వీకరించారు. శాఖాపరంగా శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నియంత్రణలో డాక్టర్ శ్రీనివాసులు చూపిన అంకితభావం, ఉత్తమ పనితీరును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
లక్ష్మీపురం: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించడంపై మరింత దృష్టి సారిస్తామని గుంటూరు డీఆర్ఎం సుధేష్ణ సేన్ అన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యాన గుంటూరు రైల్వే డివిజన్లోని నల్లపాడు పేరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్య్ర దిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్ఎం ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. రైల్వే పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ డివిజన్ పరిధిలో సాధించిన విజయాలు, ప్రగతిని వివరించారు. రైల్వే కార్యకలాపాల మెరుగుదల, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆదాయ పనితీరును మెరుగుపరచడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషిని అభినందించారు. అనంతరం పలు విద్యాసంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ విభాగాల అధికారులు, సిబ్బందికి అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం, సీనియర్ డీసీఎం, డీసీఎం, ఇంజినీరింగ్, పలు విభాగాల అధికారులతోపాటు డివిజన్ సిబ్బంది, ఆర్పీఎఫ్, జీఆర్పి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


