వేటపాలెం: మండల పరిధిలోని కఠారివారిపాలెం మత్స్యకార గ్రామంలో కటారి నరసింహం ఇంట్లో దొంగలు శుక్రవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని నరసింహం తన పొలాన్ని విక్రయించగా వచ్చిన నగుదులో నలుగురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు. మరో రూ. 34 లక్షలు తన ఇంట్లో ట్రంకుపెట్టెలో భద్రపరిచారు. శనివారం తెల్లవారుజాము తరువాత ట్రంకు పెట్టె కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. చీరాల రూరల్ సీఐ సుధాకర్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి వచ్చిన క్లూస్టీం వారు వేలిముద్రలు సేకరించారు. అయితే రాత్రి కనిపించకుండా పోయిన ట్రంకు పెట్టె ఇంటి పక్కన చిన్న గల్లీలో పడేసి ఉంది. అందులో ఉండాల్సిన నగదు మాయమైంది. గ్రామంలో తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని భావిస్తున్నారు.


