పెదకాకాని: పెదకాకానిలో తాళాలు వేసి ఇళ్లే టార్గెట్గా దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని గ్రామానికి చెందిన రాధారపు నాగేశ్వరరావు ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఫిరంగిపురం మండలం వేములూరుపాడులో పెద్ద కుమార్తె బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు నాగేశ్వరావు భార్య, చిన్న కుమార్తె వెళ్లారు. అదే రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి రాకుండానే బస్టాండ్ నుంచి నాగేశ్వరరావు కూడా బంధువుల వివాహానికి వెళ్లాడు. వివాహ కార్యక్రమం ముగించుకొని శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు భావించి, పెదకాకాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్టీంతో చేరుకున్నారు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 15 సవర్లు బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేలు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.
15 సవర్లు బంగారం అపహరణ


