రణ స్థలంలో దిమ్మైపె ఉంచిన కన్నమదాసు విగ్రహం
కారెంపూడి: పల్నాటి మాచర్ల రాజ్య వీర సేనాని మాల కన్నమదాసు విగ్రహం పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో కొలువుదీరడానికి శుక్రవారం తరలివచ్చింది. గ్రామ నడిబొడ్డున కన్నమదాసు మేడ వద్ద విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు కన్నమదాసు మేడ ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల వైఎస్సార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆలోచన, సహకారం మేరకు అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు మాల సమాజం నడుం బిగించింది. మర్రి శేషయ్య ఆధ్వర్యంలో మాలలు పనులు కూడా శరవేగంగా చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేటలో చేయించిన తొమ్మిది అడుగుల కన్నమదాసు విగ్రహాన్ని వైఎస్సాసీపీ నాయకులు రణస్థలానికి తరలించారు. విగ్రహాన్ని క్రేన్తో దిమ్మైపె ఉంచారు. ఇప్పటికే బ్రహ్మనాయడు విగ్రహం రణస్థలంలో ఉంది. ఆయన మానస పుత్రుడు కన్నమదాసు విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటైతే పల్నాటి రణక్షేత్రం మరింత చారిత్రక శోభ సంతరించుకుంటుంది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమావతు ప్రమీలాభాయితేజానాయక్, మర్రి శేషయ్య, ఎంపీటీసీ సభ్యులు అంతరగడ్డ ఏసోబు, చెన్నకేశవస్వామి ట్రస్టు బోర్డు చైర్మన్ చల్లా వీర్లవరప్రసాదరావు, కాలె రాంబాబు, కాలె మల్లేశ్వరరావు, కాలె శివ, మైలా ఆనందరావు, నూకాబత్తిన సాంబయ్య, పాతూరి రామిరెడ్డి, ఆశం విజయభాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


