అక్రమాలను ప్రశ్నించినవారిపై అడ్డగోలు కేసులు పెట్టడం దారుణం
నారా లోకేష్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలి
డీఎస్సీ అక్రమాలపై టౌన్హాలు సదస్సులో పీఆర్కే
నిండా ముంచిన ప్రభుత్వం
మాచర్ల: డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. డీఎస్సీ అక్రమాలపై మాచర్ల పట్టణంలోని పిన్నెల్లి లక్ష్మారెడ్డి కల్యాణ మండపంలో టౌన్ హాలు సదస్సు నిర్వహించారు. ఇందులో పిన్నెల్లి మాట్లాడుతూ నిరుద్యోగులను మోసం చేసిన వారిని వదలబోమన్నారు. క్రీడా కోటా జీవో మార్చి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతూ అక్రమ కేసులు నమోదు చేయించడం సమంజసం కాదన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి పెండింగ్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రూ. లక్షల కోట్లు రుణాలు తెచ్చి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.
వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం ఇలా వ్యవహరిస్తున్న వారిని వదలబోమని హెచ్చరించారు. రానున్న కాలంలో అక్రమ కేసులు నమోదు చేసిన వారిని నిందితులుగా చేర్చి జైలుకు పంపుతామని తెలిపారు. నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, అంబేడ్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు.
సదస్సులో మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు కొమ్మారెడ్డి చలమారెడ్డి, జిల్లా నాయకుడు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, నువ్వులూరి చెన్నారెడ్డి, చల్లా కాశయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్య, అబ్దుల్ జలీల్, బోయ రఘురామిరెడ్డి, మంద సంతోష్, ఎంఆర్ఎఫ్ రామారెడ్డి, పిల్లి కొండలు, బాలమ్మ, ప్రసాద్, రాజు, కొమ్ము వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు అబ్దుల్ సత్తార్, నాగూర్ కిజర్, చిల్లంచర్ల సత్య, ట్రాక్టర్ కరీముల్లా, కొత్తపల్లి కొండలు, హనిమిరెడ్డి, వేల్పుల గురవయ్య, హైట్ వీరారెడ్డి, కారంపూడి అంజిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తాడి వెంకటేశ్వరరెడ్డి, ఎరబోతుల శ్రీనివాసరావు, గువరమ్మ, వెలిదిండి గోపాల్, వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆకాష్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మస్తాన్, మాచర్ల సుందరరావు, బి.మరియమ్మ, రత్నకుమారి, కుర్రి సాయి మార్కెండేయరెడ్డి, నాగ అంజి, జి.శ్రీను, జెడ్పీటీసీలు ఎం.స్వామి, బాలునాయక్, భాస్కర్రెడ్డి, మాజీ ఎంపీపీలు సంపూర్ణమ్మ, చౌడేశ్వరి, ఎస్టీ జిల్లా నాయకులు జాన్పాల్, పట్టణ, మండల అధ్యక్షులు కోలా శ్రీనివాసరావు, యు.వెంకటేశ్వర్లు, జి.బ్రహ్మారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం, కె.శివలింగరాజులు ఉన్నారు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేయడం లక్ష్యంగా టీడీపీ పాలన కొనసాగిస్తోందన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులను దగా చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహారం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో 1.30 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చాన్నారు. టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో 16 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, తమ కార్యకర్తలను ఉద్యోగులుగా నియమించుకుందన్నారు. దీనిపై మంత్రి లోకేష్ చర్చకు రావాలన్నారు.


