ఎన్నాళ్లిలా..? | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లిలా..?

Aug 5 2026 2:11 AM | Updated on Aug 5 2026 2:11 AM

అనుకూల అధికారి కోసం ప్రయత్నాలు?

కొలిక్కిరాని పల్నాడు జిల్లా ఎస్పీ నియామకం

కేంద్ర సర్వీసులకు బి. కృష్ణారావు వెళ్లాక పోస్టు ఖాళీ

రెండేళ్లలో ఇప్పటికే నలుగురు ఎస్పీలు బదిలీ

అక్రమ కేసులు, సివిల్‌ పంచాయితీలతో నిత్యకృత్యంగా వివాదాలు

చక్రం తిప్పేందుకు రంగంలోకి పేకాట క్లబ్‌ నిర్వాహకులు

అనుకూలంగా వ్యవహరించే అధికారి కోసం ప్రయత్నాలు

పల్నాడు జిల్లాలో ఎస్పీని కూడా నియమించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. చిలకలూరిపేట, సత్తెనపల్లిలో వెలసిన పేకాట క్లబ్‌.. పెదకూరపాడులోనూ షో తిప్పేందుకు సిద్ధమవుతోంది. నెత్తుటి కత్తి నడివీధిలో చిందులేస్తూ రౌడీరాజ్యాన్ని తలపిస్తోంది. పట్టపగలే పగిలిన ఇళ్ల తాళాలు.. భద్రతను గాలిలో దీపంలా మారుస్తున్నాయి. మైనింగ్‌ వాహనాలు అడ్డదారుల్లో దూసుకెళ్తున్నాయి. బాస్‌ లేక అత్యధిక భాగం పోలీసు స్టేషన్లలో న్యాయం గుమ్మం వద్దే నిలిచిపోతోంది. సివిల్‌ పంచాయితీలు, అక్రమ కేసుల దందా చట్టం కళ్లకు అవినీతి గంతలు కడుతోంది. అన్యాయాలు, అక్రమాలు, అభాగ్యుల ఆక్రందనలతో జిల్లా విలవిల్లాడుతోంది.
కీలక జిల్లా...

సాక్షి, నరసరావుపేట: శాంతిభద్రతల దృష్ట్యా ఎంతో కీలకమైన పల్నాడు జిల్లాకు పోలీస్‌బాస్‌ లేక పరిస్థితి అదుపు తప్పుతోంది. ప్రజల బాగోగుల కోసం నియామకానికి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి బిందుమాధవ్‌, మల్లికా గార్గ్‌, కంచి శ్రీనివాసరావులు పనిచేసి బదిలీపై వెళ్లగా, తాజాగా విధులు నిర్వహించిన బి. కృష్ణారావు ఇప్పటికే రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసులోకి వెళ్లి సీబీఐలో సేవలు అందిస్తున్నారు. ఆయన బదిలీపై వెళ్లి నెల రోజులవుతున్నా, నేటికీ ఆయన స్థానంలో కొత్త ఎస్పీని ప్రభుత్వం నియమించలేదు. అధికార పార్టీ ఒత్తిళ్లు, అక్రమాలకు వత్తాసు పలకాలన్న ప్రచారం నేపథ్యంలో కొందరు అధికారులు పల్నాడు జిల్లాకు ఎస్పీగా రావడానికి వెనుకాడుతున్నారని ప్రచారం నడుస్తోంది. అత్యంత సమస్యాత్మక జిల్లా అయిన పల్నాడులో ఎస్పీ కుర్చీ ఖాళీగా ఉండటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. కొంతకాలంగా పల్నాడు జిల్లా పోలీసు వ్యవస్థ గాడితప్పింది. ముఖ్యంగా సివిల్‌ పంచాయితీలతో విసిగిన బాధితులు పోలీసు స్టేషన్ల వద్ద ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలు, దోపిడీలు పోలీసు వ్యవస్థ పనితీరుకు సవాల్‌ విసురుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నేతలు, సానుభూతిపరులపై అక్రమ కేసులతో వేధించి రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది.

ఐదో ఎస్పీ ఎవరో...?

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎస్పీగా పనిచేస్తున్న బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కౌంటింగ్‌కు ముందే సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో 2024 మే 18న మల్లికాగార్గ్‌ బాధ్యతలు స్వీకరించారు. ముక్కుసూటి అధికారిణిగా పేరున్న మల్లికాగార్గ్‌ను కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారని ప్రచారం నడిచింది. అదే ఏడాది జూలై 13 వరకు, అంటే ఆమె కేవలం రెండు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఆమె స్థానంలో కొత్త ఎస్పీగా పల్నాడు జిల్లాకు కంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో జిల్లాలో రాజకీయ హత్యలు జరిగాయి. వీటి దర్యాప్తులో అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు సమాచారం. కేవలం 14 నెలలు మాత్రమే విధులు నిర్వహించిన అనంతరం ఆయన బదిలీపై వెళ్లిపోయారు. 2025 సెప్టెంబర్‌ 14న బి. కృష్ణారావును ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి కారణాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో చట్టానికి విరుద్ధంగా పనిచేయడం ఇష్టం లేక వెళ్లారని సమాచారం. ఎస్పీ చాంబర్‌లోకి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వెళ్లి గడియ పెట్టుకొని రోజంతా హైడ్రామా నడిపిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారణాలు ఏవైతేనేం, పట్టుమని పది నెలలు కూడా పనిచేయకుండానే నిజాయతీ గల అధికారి జిల్లాను వదిలి వెళ్లడం విచారకరమని పోలీసు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన స్థానంలో ఎవరు వస్తున్నారంటూ తీవ్ర చర్చ నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా ఏర్పడినప్పటి నుంచి తొలి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్‌రెడ్డి రెండేళ్లకుపైగా సమర్థంగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చే ఎస్పీ అయినా రవిశంకర్‌రెడ్డిలా ఎక్కువకాలం పనిచేస్తే జిల్లాపై పూర్తి అవగాహన వచ్చి శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి వీలు పడుతుందని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సత్తెనపల్లిలో గత కొంతకాలంగా అధికార పార్టీ నేతల అండదండలతో పేకాట క్లబ్‌ యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నిత్యం వందల మంది పేకాట రాయుళ్లు జిల్లాతోపాటు గుంటూరు, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నారు. సత్తెనపల్లి క్లబ్‌ దెబ్బకు చిలకలూరిపేట, గుంటూరు క్లబ్‌లకు సైతం తాకిడి తగ్గిందని సమాచారం. నిత్యం భారీ మొత్తంలో ఆర్జిస్తున్న పేకాట నిర్వాహకులు తమకు అనుకూలంగా ఉండే అధికారికి ఎస్పీ పోస్టింగ్‌ వేయించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానికంగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ యువనేత వద్ద ఈ ప్రతిపాదన ఉంచారని తెలుస్తోంది. తమకు అనుకూలంగా అధికారి వస్తే త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న పెదకూరపాడు నియోజకవర్గంలోని పేకాట క్లబ్‌కు సైతం ఇబ్బందులు తలెత్తవని వారి పన్నాగంగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement