జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో 16 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్లలోపు విద్యార్థుల కోసం రోవర్స్, రేంజర్స్ యూనిట్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీసీ ప్రొఫెసర్ డాక్టర్ హృషికేష్ శనాపతి మ్యుఖ్య అతిథిగా హాజరై యూనిట్ను లాంచనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు సత్యమార్గంలో పయనించాలని, ప్రకృతి ప్రేమికులుగా మారాలని సూచించారు. కొరాపుట్ జిల్లా రోవర్స్, రేంజర్స్ యూనిట్ ఆర్గనైజింగ్ కమిషనర్, స్కౌట్ టీచర్ నిరంజన్ పాణిగ్రహి మాట్లాడుతూ.. సమాజంలో విద్యార్థుల పాత్ర ఎలా ఉండాలో వివరించారు. వర్సిటీ పరీక్షా విభాగ అధిపతి పీజీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత పాత్రో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఇతర కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యమివ్వాలని ఉద్భోదించారు. రిజిస్టార్ మహేశ్వర నాయిక్ మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్పై ప్రణాళికతో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్, యూనిట్ లీడర్ డాక్టర్ విజయ కుమార్ సెఠీ, గణిత ప్రొఫెసర్ సంతోషిని నాయిక్ తదితరులు పాల్గొన్నారు.


