రాయగడ: స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ కొన్ని మారుమూల గ్రామాలు కనీసం రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదు. తాజాగా రాయగడ జిల్లాలోని గుడారి సమితి సిరిగుడ పంచాయతీ సడాకణ గ్రామానికి రోడ్డులేని దుస్థితి కారణంగా ఓ నిండు గర్భిణిని మంచంపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సుమి కడ్రకకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. దీంతో ఆమెను ఒక మంచంపై ఉంచి గ్రామస్తులు బురద, గుంతలు, కాలువలతో నిండిన దారిలో దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలోని బడపంకాల్ వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబులెన్స్ సాయంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో గ్రామానికి వెళ్లే దారి బురదమయం కావడంతో పూర్తిగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


