రాయగడ:
గ్రామంలోకి దూసుకొచ్చిన అడవి ఏనుగు ఇంట్లోకి ప్రవేశించి అన్నం, పప్పు, కూరతో పాటు గంజి, రాగి జావను తినేసింది. అంతేకాకుండా ఇంట్లోని వంట పాత్రలను చిందరవందర చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సునాఖండి పంచాయతీ పరిధి ఉపర్పోలి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీ హుయిక కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక అడవి ఏనుగు గ్రామంలోకి చొరబడింది. ఇంటి కంచె, గోడను ధ్వంసం చేసి, తొండం సాయంతో పాత్రలను బయటకు విసిరేసింది. ఇంటి బయట సాగు చేస్తున్న పైనాపిల్ పంటను తొక్కి ధ్వంసం చేసింది. ఏనుగు భీభత్సంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏనుగు తిరిగి అడవివైపు వెళ్లిపోయిన తర్వాత కూడా భయంతో రాత్రంతా నిద్రపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పైనాపిల్ పంట ధ్వంసం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.


