రాయగడ: రాయగడ – కొరాపుట్ – జయపూర్ రైల్వే సెక్షన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, రైళ్ల నిర్వహణ, భద్రతా చర్యలు, మౌలిక వసతులు, ప్రయాణికుల సౌకర్యాలను ఈస్ట్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ పరిశీలించారు. రాయగడ నుంచి జయపూర్ వరకు విండో ట్రైలింగ్ ద్వారా రైల్వే మార్గాన్ని పరిశీలించి పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేట్రాక్ పరిస్థితి, సిగ్నలింగ్ వ్యవస్థ, రైళ్ల రాకపోకలు, మార్గంలో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. సింగాపూర్ రోడ్ – కారపుట్ రైల్వే సెక్షన్లో జరగుతున్న రైల్వే లైన్ డబ్లింగ్ పనులపై కూడా సమీక్షించారు. రైల్వేమార్గ సామర్థ్యాన్ని పెంచడం, రైళ్ల రాకపోకలను మరింత సులభతరం చేయడం, ఈ ప్రాంతంలో రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేయడం డబ్లింగ్ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంత సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. అలాగే వివిధ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఆయనతో పాటు రాయగడ రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ సింఘాల్ తదితరులు ఉన్నారు.


