● అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కై వసం
● తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో సిక్కోలు క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. వియత్నాంలో తాజాగా నిర్వహించిన ఓపెన్ ఇంటర్నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీల్లో జిల్లాకు చెందిన తల్లీ కొడుకులు ప్రాతినిధ్యం వహించడంతోపాటు పతకాలతో సత్తాచాటారు. ఏపీ నుంచి భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన రిమ్స్ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శిరీష 42 ఏళ్ల వయస్సు కేటగిరీ పూమ్ షే విభాగంలో బంగారు పతకం సాధించగా, క్యాడెట్ విభాగంలో ఆమె కుమారుడు కారే మోక్షిత్ రజత పతకం సాధించాడు. వీరిద్దరినీ శ్రీకాకుళంకు చెందిన కొమర మోహనకృష్ణ ఉత్తమంగా శిక్షణ అందించి తీర్చిదిద్దారు.
ఘనంగా సత్కారం..
మెగా స్పోర్ట్స్మీట్ను ముగించుకుని జిల్లాకు వచ్చిన తల్లీ తనయుడు డాక్ట శిరీష, మోక్షిత్లను తైక్వాండో సంఘ ప్రతినిధులు, వాకర్లు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు, గ్యాస్ట్రాలజిస్ట్ డాక్టర్ గొండు గంగాధర్, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత, రిమ్స్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కారే సంజీవకుమార్, ఎస్.జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ గేదెల ఇందిరా ప్రసాద్, ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హారిక ప్రసాద్, రాజేష్, వాకర్స్ క్లబ్ సభ్యులు రెడ్డి సాయిరాం, తామాడ లోకేష్, శిక్షకులు లక్ష్మణ పాల్గొన్నారు.


