● సహాయ సామగ్రి రవాణా
ప్రారంభించిన గవర్నర్ దంపతులు
భువనేశ్వర్: రాష్ట్రంలో వరద బాధితుల కోసం సహాయ సామగ్రి రవాణాను గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సతీమణి జయశ్రీ కంభంపాటి పాలుపంచుకున్నారు. విశాఖపట్నం శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్ సంస్థ సహాయ సామగ్రి సమకూర్చింది. ఆదివారం లోక్ భవన్ ప్రాంగణం నుంచి జెండా ఊపి సహాయ సామగ్రి రవాణా ప్రారంభించారు. ట్రస్ట్ ప్రధాన సంక్షేమ కార్యక్రమమైన శ్రీ సత్యసాయి దివ్యామృతంలో భాగం 1,500 రేషన్ కిట్లు సిద్ధం చేశారు. ఒక్కో కిట్లో బియ్యం, పప్పు, వంట నూనె, పంచదార, గోధుమ పిండి, ఉప్పు, అటుకులు, సబ్బు వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్నట్లు సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్ సంస్థ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల్లో తీవ్రంగా ప్రభావితమైన భద్రక్, బాలాసోర్ 2 జిల్లాల్లో ఇళ్లు, జీవనోపాధిని కోల్పోయి ప్రభావితులైన కుటుంబాలకు ఈ సహాయక సామగ్రిని పంపిణీ చేయడం లక్ష్యంగా పేర్కొన్నారు. వరదలు తదనంతర విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సకాలంలో సముచిత సహాయం అందజేయడం అభినందనీయమని గవర్నర్ దంపతులు శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్ఫేర్ కార్యకర్తలను ప్రోత్సహించారు.


