రాయగడ: రథయాత్రలో భాగంగా స్థానిక గోపబంధు మార్గ్ వద్ద గల గుండిచా మందిరంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రదేవతా మూర్తులు కొలువయ్యారు. స్వామివారు శుక్రవారం మత్స్య అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కళకళలాడగా, భజనలు, హరినామ సంక్తీరణలతో ఆధ్యాత్మిక వాతవరణం నెలకొంది. స్వామి వారి మత్స్యరూప దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలగించిందని భక్తులు తెలిపారు.
కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా
మోర్చ కార్యదర్శిగా భవానీరెడ్డి
జయపురం: కొరాపుట్ జిల్లా బీజేపీ మహిళా మోర్చ కార్యదర్శిగా కె.భవానీరెడ్డి నియమితులయ్యారు. దీంతో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె నియామకంపై కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా భవానీరెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో 17 శాతం
అధిక వర్షపాతం
● పొంగి ప్రవహిస్తున్న నదులు
భువనేశ్వర్: ఈ ఏడాది జూలై ఒకటి నుండి 17వ తేదీ వరకు రాష్ట్రంలో 17 శాతం అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నత ఇంజినీర్ దిలీప్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. బొలంగిర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరద పరిస్థితి ఏర్పడిందన్నారు. సపువా నదిలో వరద మధుసూదప ట్న, కకుడియా గ్రామాలను ముంచెత్తింది. నదిలో నీటి మట్టం పెరిగితే ఢెంకనాల్, అఠొగొడొపై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. శనివారం నాటికి హీరాకుడ్ జలాశయంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. జలకా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. బాలాసోర్ జిల్లా బొస్తా మండలం మథానిలో ప్రమాద స్థాయి 6.50 మీటర్లు కాగా ప్రస్తుతం అక్కడ 6.52 మీటర్లకు పైగా నీరు ప్రవహిస్తోంది.
నేడు అడప మండపం ప్రవేశం
భువనేశ్వర్: శ్రీ మందిరం నుంచి యాత్రగా తరలి వచ్చిన దేవతా మూర్తులు శని వారం శ్రీ గుండిచా మందిరం అడప మండపంపై ఆశీనులు కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం శారదాబాలి ప్రాంగణానికి చేరుకున్న దేవతలు రథాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకమార్గ దర్శన విధానంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసినట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ గుండిచా మందిరం పరిసరాల్లో ఏర్పాట్లు ఆయన శుక్ర వారం ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. రథాలపై కొలువై ఉన్న దేవుళ్లు ఏక మార్గంలో వరుస క్రమంలో సునాయాసంగా దర్శించుకుని సంతృప్తి చెందే దిశలో సన్నాహాలు చేసినట్లు వివరించారు. శనివారం సాయంత్రం రథాలపై కొలువై ఉన్న చతుర్థా మూర్తులను అడప మండపానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది శారదాబాలి ప్రాంగణంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం ముందు జాగ్రత్తలతో ఆచితూచి అడుగు వేస్తుందన్నారు. భక్తులకు క్రమబద్ధమైన దర్శనం కల్పించడంలో పూరీ జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


