న్యూస్రీల్
గుండిచా ఆవరణకు
● నేడు అడప మండప విజే
భువనేశ్వర్: రాత్రి విరామం తర్వాత శ్రీ జగన్నాథుని రెండో రోజు వార్షిక రథ యాత్ర తిరిగి శుక్ర వారం ప్రారంభమైంది. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలు గుండిచా ఆలయం ముందున్న శారదా బాలికి సురక్షితంగా చేరుకున్నాయి. ఉదయం వేలాది మంది పోలీసు సిబ్బంది, లక్షలాది మంది భక్తులు చేతులు కలిపి బొడొ దండొ వెంబడి 3 భారీ చెక్క రథాలను లాగడంతో రథ యాత్ర తిరిగి ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2.6 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి ఊరేగింపు మిగిలిన మార్గాన్ని పూర్తి చేస్తుండగా పుణ్యక్షేత్ర పట్టణం జై జగన్నాథ్ భక్తి నినాదంతో ప్రతిధ్వనించింది.
ఉత్సవ పొహండి ఊరేగింపులో జాప్యం కారణంగా గురువారం యాత్ర అసంపూర్తిగా మిగిలిపోయింది. ఫలితంగా సూర్యాస్తమయం సమయానికి ముందుగా ఏ ఒక్క రథం తమ గమ్య స్థానం చేరుకోలేకపోయింది. దీంతో అధికారులు ఆ రోజు ఊరేగింపును నిలిపి వేశారు. దేవతా మూర్తులు రాత్రంతా తమ తమ రథాలపైనే కొలువై ఉన్నారు. మొదటి రోజు ఊరేగింపు ముగిసే సరికి బలభద్రుని తాల ధ్వజ రథం దాదాపు 700 మీటర్లు ప్రయాణించి మార్కెట్ చౌరస్తాకు చేరుకోగా, సుభద్ర దేవి దర్ప దళన్ రథం సుమారు 400 మీటర్లు ప్రయాణించి మారీచికోట్ ఛక్ వద్ద ఆగిపోయింది. జగన్నాథుని నందిఘోష రథం శ్రీ జగన్నాథ ఆలయ సింహ ద్వారం నుంచి కొద్ది దూరం మాత్రమే కదలగా ఊరేగింపును నిలిపివేశారు.
శుక్రవారం ఉదయం యాత్ర పునః ప్రారంభం కావడంతో మిగిలిన దూరాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేసి మూడు రథాలను గుండిచా ఆలయం ముందున్న శారదా బాలి వద్ద నిలిపారు. శ్రీ జగన్నాథ ఆలయం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి మాట్లాడుతూ చతుర్థా మూర్తులు శుక్రవారం రాత్రి తమ రథాలపైనే గడుపుతారని తెలిపారు. గుండిచా ఆలయంలోకి అడపా మండప విజేగా ప్రసిద్ధి చెందిన ఉత్సవ ప్రవేశ ఊరేగింపు జూలై 18 శనివారం నాడు జరగనుంది. బహుడా యాత్ర సమయంలో శ్రీ జగన్నాథ ఆలయానికి తిరిగి వచ్చే ముందు చతుర్థా మూర్తులు కొన్ని రోజులపాటు గుండిచా ఆలయంలోనే కొలువుదీరుతారు.


