పెళ్లింట విషాదం.. బైక్‌పై సామానులతో వస్తుండగా

- - Sakshi

ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణ పరిధి బొడ్డేపల్లిపేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన యువకుడు చిలకలపల్లి మణికంఠ (23) కొర్లకోటలో తన పిన్ని కుమారుడు వివాహం జరుగుతున్న సందర్భంగా ఇద్దరు మహిళలు పిడిమి రాజులమ్మ, పిడిమి మీనాలను తన బైకుపై ఎక్కించుకొని కొంత సామానులతో వస్తున్నాడు.

అదే సమయంలో శ్రీకాకుళం నుంచి పాలకొండవైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో మణికంఠ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజులమ్మ, మీనాలకు తీవ్ర గాయాలు కావడంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన రాజులమ్మ తమ్ముడి వివాహం కోసం కన్నవారి గ్రామం కొర్లకోట ఇటీవల చేరుకుంది.

వివాహ సామగ్రి కొనుగోలు నిమిత్తం తోటికోడలు మీనాతో కలిసి మణికంఠ బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. రాజులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమదాలవలస ఎస్‌ఐ వై.కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో వివాహం జరుగుతున్న వేళ పెండ్లికుమారుడి పిన్ని కొడుకు మృతిచెందడం, అక్క, పిన్నికుమార్తెకు గాయాలు కావడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

బుడితిలో విషాదఛాయలు
సారవకోట:
చిలకపల్లి మణికంఠ మృతితో స్వగ్రామం బుడితిలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి పాపారావు బుడితి జంక్షన్‌లో రైస్‌మిల్లులో హమాళిగా పనిచేస్తుండగా, మణికంఠ పెయింటింగ్‌ పనులకు వెళ్తుండేవాడు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top