విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ వీఆర్కు..
విమానాశ్రయం(గన్నవరం): ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్కు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముసునూరులో జరగనున్న నూతన పాప్కార్నికా సీడ్ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏలూరు రేంజ్ డీఐజీ జి.వి.జి.అశోక్కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, బోడె ప్రసాద్, వర్ల కుమార్రాజా, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప రాష్ట్రపతి రోడ్డు మార్గంలో ముసునూరు బయలుదేరి వెళ్లారు. ఆ పర్యటనను పూర్తిచేసుకున్న ఉప రాష్ట్రపతి మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గవర్నర్ అబ్దుల్నజీర్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారా లోకేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.
ఉప రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే సమయంలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ, ఇద్దరు సిబ్బందిపై ఉన్నతాధికారులు శాఖా పరమైన చర్యలు తీసుకున్నారు. దుర్గాపురం వద్ద హెచ్సీఎల్లో పనిచేసే ఉద్యోగిని క్యాంపస్లోకి వెళ్లేందుకు జాతీయ రహదారి సెంట్రల్ డివైడర్పై నిలబడి ఉంది. ఆమెను గమనించిన ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు అక్కడ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉయ్యూరు టౌన్ ఎస్ఐ ప్రతాప్రెడ్డిని వీఆర్కు పంపిస్తూ, మచిలీపట్నంనకు చెందిన హెడ్ కానిస్టేబుల్ వడ్డికాసులను హనుమాన్ జంక్షన్, కానిస్టేబుల్ బాలాజీని గన్నవరం పోలీస్స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశించారు.


