నాగాయలంక: కృష్ణాడెల్టాలో పంటలను బతికించే బాధ్యత కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పేర్కొన్నారు. పగబట్టిన రీతిలో వరి పంటను చంపేద్దామనే ధోరణిలోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని మండిపడ్డారు. నాగాయలంక డిస్ట్రిబ్యూటరీ కమిటీ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో జరిగిన రైతుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. డీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు బీసాబత్తుని ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రమేష్బాబు మాట్లాడుతూ.. ఎగువున పులిచింతల, పట్టిసీమలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెద్దలతో దమ్ముగా మాట్లాడి సాగునీరు తీసుకు రావాల్సిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నీటిపారుదల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అబద్ధాల కోరుగా మారారని విమర్శించారు. ప్రభుత్వం, అధికారుల తీరుతో కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల్లో వ్యవసాయం కష్టాల్లో పడిందన్నారు. బర్రంకుల పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కమతం నాంచారయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, సాగునీటి కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ మండల రైతువిభాగం అధ్యక్షుడు బీమా బాబూరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు తోట సాయిబాబు మాట్లాడుతూ.. రైతుల్లో సమైక్యత లేకపోతే కష్టాలపాలు కాక తప్పదన్నారు. ఈ సంద ర్భంగా పలువురు రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్బాబు


