మహిళల భద్రతను గాలికొదిలేశారు | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతను గాలికొదిలేశారు

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

● ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని చూస్తున్న భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బాధపడుతుంటారన్నారు. నాడు నిండు కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అవమానంతో కురుక్షేత్ర యుద్ధం జరిగిందని గుర్తు చేస్తూ.. రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి అదే పరిస్థితి రాబోతుందని జోస్యం చెప్పారు. ● వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ మహిళలకే రక్షణ లేకపోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌ నడుస్తోందన్నారు. కూటమి ఎమ్మెల్యేల సహా నాయకులు మానవత్వాన్ని మరిచి సిగ్గు లేకుండా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ● మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పది వేల రూపాయల లంచం కోసం టీడీపీ నాయకుడు మహిళపై దాడి చేసి వివస్త్రను చేయడం సిగ్గు చేటని అన్నారు. అసలు ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ పని చేస్తుందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. గుంటూరు ఘటనపై సకల శాఖల మంత్రి లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఉన్నది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని, దానికి చరమ గీతంపాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ● మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు, కృష్ణాజిల్లా జెడ్పీ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, మాజీ డెప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ పదవుల్లో ఉన్న మహిళలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్యాణి మహిళపై దాడిచేసి వివస్త్రను చేసినందుకు వైఎస్సార్‌ సీపీ నిరసన కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్‌కు వినతి

హోం మంత్రి రాజీనామా చేయాలి

భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళల రక్షణను గాలికి వదిలేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి కొంత మంది హిజ్రాలతో కలిసి ఒక మహిళపై దాడి చేసి వివస్త్రను చేసినందుకు నిరసనగా వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

పవన్‌ ఎక్కడ ఉన్నారు?

వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్‌ రాయన భ్యాలక్ష్మి మాట్లాడుతూ లంచం ఇవ్వకపోతే మహిళలను వివస్త్ర చేసి, హత్యాయత్నం చేసే కొత్త సంస్కృతికి టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు. నడి రోడ్డులో ఆ మహిళకు జరిగిన అవమానాన్ని చంద్రబాబు, హోం మంత్రి అనిత పూడ్చగలరా అని నిలదీశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటే పోలీస్‌ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. గుంటూరు ఘటనకు సంబంధించి మహిళను పరామర్శించాల్సిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ వీడియోలు ఎలా బయటకు వచ్చాయని ఆరా తీయడం ఆడతనానికే మాయని మచ్చ అన్నారు.

ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ మైలవరంలో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ సీపీ మహిళపై దాడి చేశారని, నెల్లూరులో గిరిజన మహిళపై దాడి చేశారని, చంద్రబాబు సొంత జిల్లాలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించారని ఇలా రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా హోం మంత్రి ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సినీ నటి జత్వాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎస్కార్ట్‌ ఇచ్చి మరీ రాచమర్యాదలు చేసిందని, ఇది సరి కాదని ఆనాడే చెప్పామని, తాము చెప్పిందే ఈ రోజు నిజమైందని తెలిపారు. గుంటూరు ఘటనపై స్పందించని హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement