విజయవాడ : కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి దేవాదాయశాఖ నిధులు విడుదల చేయడానికి ఇచ్చిన జీవోపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ నిధులు ప్రభుత్వ పథకాలకు మళ్లించడం చట్ట విరుద్ధమని ధ్వజమెత్తింది. దేవాలయ నిధులు ఒకే కులానికి చెందినవి కాదని, అన్ని కులాలు హుండీలో వేస్తేనే ఆలయాలకు ఆదాయమని స్పష్టం చేసింది.
అటువంటప్పుడు దేవాలయ నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో తల్లికి వందనం కోసం ఇవ్వడమేంటని ప్రశ్నించింది. హిందూ ఆలయాల సొమ్మును.. తల్లికి వందనం కోసం ఎలా ఇస్తారని మండిపడింది.
‘ఆలయ ఆదాయం ఒక కార్పొరేషన్ పేరుతో ఖర్చుచేయడం తప్పు. హిందువుల ఆలయాల సొమ్మును తల్లికి వందనం కోసం ఎలా ఇస్తారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి కాకుండా హిందువుల ఆలయాల సొమ్ము నుంచి ఎలా ఇస్తారు. తక్షణమే ప్రభుత్వం జీవో నెంబర్ 1243 ను ఉపసంహరించుకోవాలి. జీవోని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతాం’ అని హెచ్చరించింది.


