సాక్షి ప్రతినిధి, విజయవాడ: గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న పనులపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టు కేటాయింపుపై వచ్చిన అవినీతి ఆరోపణలతోపాటు ఈ వ్యవహారంలో నా పాత్ర ఉందంటూ వస్తున్న విమర్శలపై సీబీఐ విచారణ జరిపించాలి. టెర్మినల్ పనులు అసంపూర్తిగా ఉండటంతో మీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పాత కాంట్రాక్టర్ను తొలగించి కేఎంవీ అనే సంస్థకు ఎయిర్పోర్ట్అథారిటీ పనులు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ కేటాయింపుపై ప్రస్తుత ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల బహిరంగ సమావేశంలో, మీడియా సమక్షంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు చేశారు. టెర్మినల్ టెండర్ కేఎంవీ సంస్థకు రావడం వెనుక పెద్ద కుట్ర జరిగినట్టు పేర్కొన్నారు. పాత కాంట్రాక్టర్ రూ.300 కోట్లతో టెర్మినల్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తిచేయగా, మిగిలిన 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి జరిగిందని వెంకట్రావు ఆరోపించారు. కేఎంవీ సంస్థ నిర్వాహకులు నాకు సన్నిహితులని, ఎన్నికల్లో నాకు ఆర్థికంగా సాయం చేసినట్టుగా కూడా ఆరోపించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా మీరు వెంటనే స్పందించి దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. విచారణలో అవినీతి జరిగిందని తేలితే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఈ అవినీతి వెనుక నా ప్రమేయం ఉందని నిర్ధారణ జరిగితే నాపై కూడా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చు’ అని వల్లభనేని వంశీ ఆ లేఖలో స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుకు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ


