అమెరికాలోని సియాటిల్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.
కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.
మరోవైపు సియాటిల్లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు.
సియాటెల్ ప్రకటన
కందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది.
కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.
ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా


