● కాంట్రాక్ట్ ఏజెన్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు
● బోధన్ జిల్లా ఆస్పత్రి తనిఖీ
బోధన్: బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తంచేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్టు ఏజెన్సీకి షోకా జ్ నోటీస్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. తాను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ఐఐహెచ్ఎఫ్ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్వో రాజశ్రీ, ఆర్డీవో విజయకుమారి, వైద్యులతో వైద్య సేవల తీరు, మౌలిక సదుపాయాలపై కలెక్టర్ సమీక్షించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ బోధన్ ఆస్పత్రిలో ప్రతి నెలా 200 కాన్పులు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని బర్త్ వెయిటింగ్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు కోసం జిల్లా పోలీస్ శాఖకు ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రుల పనితీరుపై సమ్మకాన్ని పెంపొందించాలని, వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


