డొంకేశ్వర్(ఆర్మూర్): వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలు చినుకు లేక చిన్నబోతున్నాయి. మొక్కలు నాటాల్సిన లక్ష్యం పెద్దదే అయినప్పటికీ జిల్లాలో ఇప్పటి వరకు తవ్విన గుంతల్లో నుంచి సగం గుంతల్లో కూడా మొక్కలు నాటలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షభావ పరిస్థితుల కారణంగా మొక్కలు నాటే కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 26.11లక్షల మొక్కలు నాటాలని భారీ లక్ష్యాన్ని నిర్థేశించుకోగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు కేవలం 6.50లక్షల మొక్కలను మాత్రమే నాటారు. కూలీలతో మాత్రం పెద్ద సంఖ్యలో 11 లక్షల గుంతలను తవ్వించి సిద్ధంగా ఉంచారు. అవి ఇప్పుడు పూడుకుపోతున్నాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిగిలిన 19.61లక్షల మొక్కలు నాటే లక్ష్యం పూర్తి కావడం కష్టంగా మారనుంది.
నర్సరీల్లోనే
పెరుగుతున్న మొక్కలు
వనమహోత్సవం కోసం జిల్లా వ్యాప్తంగా 530 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో 42 లక్షల మొక్కలను అధికారులు పెంచారు. వర్షాలు లేని కారణంగా పెంచిన మొక్కలన్నీ నర్సరీల్లోనే ఉన్నాయి. అవి అక్కడే పెరిగి పెద్దవిగా మారుతున్నాయి. ప్రస్తుతం మొక్కలు నాటితే వాటి సంరక్షణ ఒక సమస్య, నాటకపోతే నర్సరీల్లోనే ఉండిపోతాయనే మరో సమస్య ఏర్పడింది. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయన్నను ‘సాక్షి’ సంప్రదించగా... తవ్వించిన గుంతలు సిద్ధంగా ఉన్నందునా వర్షాలు కురవగానే మొక్కలను వేగంగా నాటించి లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
మారంపల్లిలో మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలు
లక్ష్యానికి దూరంగా వనమహోత్సవం
గుంతలు తవ్వి వదిలేసిన
‘ఉపాధి’ కూలీలు
లక్ష్యం 26.11 లక్షల మొక్కలు
ఇప్పటి వరకు నాటింది 6.50 లక్షలు..


