రేఖానాయక్ను అరెస్ట్ చేయాలి
ఖానాపూర్: ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.40 కోట్ల అవినీతికి పాల్పడిన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ను అరెస్ట్ చేయాలని సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణంలో ఆదివారం మాట్లాడారు. భారీ అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించినా ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 100కుపైగా రైస్ మిల్లులు ఉండగా, సుమారు 55 మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేవలం ఎనిమిది మందిపై మాత్రమే కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన అందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా విక్రయించిన బియ్యాన్ని రికవరీ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం నూతన్ కుమార్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు నాగుల నర్సాగౌడ్, నాయకులు చింతకుంట శంకర్, తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కన్వీనర్ మహమ్మద్ రియాసత్ తదితరులు పాల్గొన్నారు.


