కుంటాల: మండలంలోని అంబుగామ గ్రామంలో మూడు రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదివారం గ్రామస్తులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయకపోవడంతో వ్యవసాయ బోరుబావుల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కలెక్టర్ భవేశ్ మిశ్రా తమ గ్రామాన్ని సందర్శించినప్పుడు తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దత్తూరాంను ఫోన్లో సంప్రదించగా అంబుగామ గ్రామానికి మెదన్పూర్ సంపు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ట్యాంక్ శుభ్రం చేయించినందున నీటి సరఫరా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. పనులు పూర్తికాగానే నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.


