● ఇప్పటికే ఊరూరా గ్రామదేవతలకు మొక్కులు
నిర్మల్: ‘అదిగో.. కొత్త కుండలు రానే వచ్చాయి. ఇదిగో.. అమ్మ చేతిలో ఆ తల్లులకు సమర్పించేందుకు పచ్చగూర, పెరుగన్నం, పాయసం, అప్పాలు, గారెలు అన్నీ సిద్ధమయ్యాయి. ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టి, మొక్కులు చేతబట్టుకుని అందరూ సన్నద్ధమయ్యారు. డప్పు చప్పుళ్లు మొదలైన వెంటనే బయలుదేరుదాం’ అంటూ బోనాలు సమర్పించేందుకు ఊళ్లన్నీ తల్లుల గుళ్లవైపు తరలుతున్నాయి. పిల్లలను, పాడిపంటలను, పశువులను సల్లంగా కాపాడే గ్రామదేవతలకు బోనం పెట్టే సమయం ఆసన్నమైంది. పల్లెలు, పట్టణాలన్నీ ఆషాఢ పండుగలతో కళకళలాడుతున్నాయి. పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ తదితర అమ్మవార్ల గుడులన్నీ ముస్తాబయ్యాయి. ఆషాడమాసం చివరి ఆదివారం కావడంతో ఈరోజు జిల్లా అంతటా బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నారు.
శుభం కలగాలని మొక్కులు
‘అమ్మా.. మమ్మల్ని సల్లంగా చూడు. పిల్లలు, పంటలు అన్నీ బాగుండాలి. ఏడాదంతా మంచే జరగాలి. నీ మొక్కులన్నీ తీర్చుకుంటాం. నువ్వే దిక్కు తల్లీ’ అంటూ రెండు చేతులెత్తి గ్రామదేవతలకు మొక్కుతుంటారు. ఆషాఢం ప్రారంభమైనప్పటి నుంచే గ్రామ దేవతలకు బోనాలు, నైవేద్యాలు, మొక్కుల తీర్చుకోవడం కొనసాగుతోంది. అన్నీ ప్రసాదించే తల్లులకే అన్నం రూపంలో బోనం సమర్పించే పండుగ ఇది. అన్నం, పెరుగు, పాయసం, ఆకుకూరలు, అప్పాలు, గారెలు ఆయా కుటుంబాల ఆచారానుసారం సమర్పిస్తారు. ఊరంతా ఒకేసారి బోనాన్ని కుండల్లో ఉంచి, పైన దీపం వెలిగించి, తలపై మోసుకుని శివసత్తులు, పోతరాజులు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా తల్లుల సన్ని ధికి చేరుకుంటారు. దారి పొడవునా పసుపునీళ్లు, పసుపు, వేపాకులు చల్లుతూ వెళ్తారు. మోదుగ ఆకుల్లో బోనాలను సమర్పించడం ప్రత్యేకం.
ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఆషాఢం మొదలైనప్పటి నుంచే అమ్మవార్ల ఆలయాలను అందంగా అలంకరించారు. జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ మహాలక్ష్మమ్మ, పలువాడల్లోని పోచమ్మ, మంచిర్యాల రోడ్డులోని మారెమ్మ, పెద్దమ్మలతో పాటు ఇతర తల్లులకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో నైవేద్యాలు అర్పించనున్నారు. ఇందుకు సంబంధిత ఆలయ కమిటీలు, మున్సిపాలిటీ సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేశారు.
లక్ష్మణచాంద మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. మండల సమీపంలోని వరి పొలాలకు ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులతో వరినాట్లు వేయించి ప్రత్యక్ష అనుభూతిని కలిగించారు. ఈ సందర్భంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రమేశ్గౌడ్, వృత్యంతర వ్యవసాయ ఉపాధ్యాయుడు కాళీదాస్ విద్యార్థులకు సూచనలు చేస్తూ వరి సాగుపై ప్రత్యక్ష అనుభవం కలిగించారు. ఇందులో ప్రధానోపాధ్యాయుడు, ఇన్చార్జి ఎంఈవో రాజు నాయక్, ఉపాధ్యాయుడు రమేశ్గౌడ్, విద్యార్థులు పాల్గొన్నారు. – లక్ష్మణచాంద
పొలంలో దిగి.. నాట్లు వేసి..


