లక్ష్మణచాంద: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఒక్కో సర్పంచ్తో మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అభివృద్ధి పనులపై ఎప్పటి కప్పుడు మండల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ తనకు వివరాలు తెలియజేయాలన్నారు. సమావేశంలో జిల్లా హార్టికల్చర్ అధికారి బీవి.రమణ, తహసీల్దార్ సంతోష్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం
నిర్మల్చైన్గేట్: పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ కాలనీలో రూ.5 లక్షల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన కామన్ కమ్యూనిటీ షెడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వినీష లక్ష్మి, గంజి రాజు, రావులవార్ విఠల్, కూన శశాంక్, శ్రీరామోజీ నరేష్, బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, జుట్టు దినేష్, సాదం అరవింద్, చందు, ఈశ్వర్, ఆనంద్, ప్రజోత్, జమాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.


