ఈషా యోగా సెంటర్‌ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం  | Woman Who Went missing From Isha Yoga Center Coimbatore Found Dead | Sakshi
Sakshi News home page

ఈషా యోగా సెంటర్‌ నుంచి అదృశ్యం.. బావిలో శుభశ్రీ మృతదేహం

Jan 2 2023 3:04 PM | Updated on Jan 2 2023 3:13 PM

Woman Who Went missing From Isha Yoga Center Coimbatore Found Dead - Sakshi

సాక్షి, చెన్నై : కోయంబత్తూరు ఈషాయోగా కేంద్రంలో యోగా శిక్షణకు వెళ్లి అదృశ్యమైన శుభశ్రీ మరణించింది. ఓ బావిలో ఆమె మృతదేహం  ఆదివారం మధ్యాహ్నం బయట పడింది. వివరాలు.. తిరుప్పూర్‌కు చెందిన పళణి కుమార్‌ భార్య శుభశ్రీ గత ఏడాది డిసెంబర్‌లో వారం రోజుల పాటుగా ఈషాయోగా కేంద్రంలో శిక్షణ నిమిత్తం వెళ్లారు. గత నెల 18వ తేదీన ఆమె అదృశ్యమయ్యారు. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. సీసీ కెమెరాలలో ఆమె ఈషా యోగా కేంద్రం నుంచి బయటకు ఓ రోడ్డు మార్గంలో వెళ్తుండటం వెలుగు చూసింది.

దీంతో ఆ పరిసరాలలో ఆమె కోసం గాలిస్తూవచ్చారు. ఆదివారం మధ్యాహ్నం సెమ్మేడు గాంధీ కాలనీలోని ఓ పాడు పడ్డ బావిలో మహిళ మృత దేహం బయట పడింది. పరిశీలనలో ఆ మృతదేహం శుభశ్రీగా తేలింది. శిక్షణకు వెళ్లిన శుభశ్రీ, యోగా కేంద్రం నుంచి బయటకు వచ్చేయడం, ఆ తర్వాత అదృశ్యం కావడం, ప్రస్తుతం మృతదేహంగా బావిలో తేలడం మిస్టరీగా మారింది. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement