ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక! | Vijays PM Ambition Rahuls Political Dilemma | Sakshi
Sakshi News home page

ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక!

Sep 5 2026 7:24 PM | Updated on Sep 5 2026 7:59 PM

 Vijays PM Ambition Rahuls Political Dilemma

టీవీకే 2029లో లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగే తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌కు ‘ఇక్కడా కాదు.. అక్కడా కాదు’ అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్‌ తివారీ విశ్లేషించారు. అంటే, రాహుల్‌ గాంధీ మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. 

విజయ్‌ 2029లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే, రాహుల్‌ గాంధీకి ప్రతిపక్షాల తరఫున ప్రధాన నాయకుడిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావచ‍్చు. విజయ్‌ ఎదుగుదల వల్ల రాహుల్‌కు ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిపత్యం లేకుండా, రాజకీయంగా మధ్యలో ఇరుక్కునే పరిస్థితి రావచ్చు. 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా విజయ్‌ పనితీరు, టీవీకేకు లభించే ప్రజాదరణ, కాంగ్రెస్‌తో కొనసాగించే పొత్తు ఈ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి.

తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ ఇప్పటికే బహిరంగ చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇది తమిళనాడులో టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం.

విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి నేరుగా సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీవీకే తన మిత్రపక్షాలతో సెప్టెంబర్‌ 9న సమావేశం నిర్వహించనుంది.

దక్షిణాది నుంచి ప్రధాని రావాలి 
టీవీకే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్‌ను జాతీయ రాజకీయాల కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మంత్రి ఆధవ్‌ అర్జున దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాలని తమిళనాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి జగదీశ్వరి.. విజయ్‌ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని అన్నారు. ఎమ్మెల్యే కనిమొళి అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు విజయే టీవీకే ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. “ఎవరు ప్రధాని కావాలో ఢిల్లీ నిర్ణయించదు. తమిళనాడు నిర్ణయిస్తుంది” అని ఆమె అన్నారు. రాహుల్‌ గాంధీ కూడా విజయ్‌ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇస్తారని ఆమె పేర్కొన్నారు.

తాజా ఇండియా టుడే సీ ఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో తదుపరి ప్రధానమంత్రిగా విజయ్‌కు 9 శాతం మద్దతు లభించింది. నరేంద్ర మోదీ 48.7 శాతంతో ముందుండగా, రాహుల్‌ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు రషీద్‌ కిద్వాయ్‌ మాత్రం 543 స్థానాల లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా చూడటం తొందరపాటు, అత్యాశతో కూడిన లక్ష్యమని అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం విజయ్‌ ప్రధాని ప్రచారాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్‌ దీన్ని అభిమాన సంఘం తరహా ఆలోచనగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ప్రధాని కావాలంటే 272 మంది ఎంపీల మద్దతు అవసరమని అన్నారు.

ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్‌.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement