13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం | UK engineers arriving in Kerala to repair stranded F-35B jet | Sakshi
Sakshi News home page

13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం

Jun 28 2025 4:45 AM | Updated on Jun 28 2025 4:45 AM

UK engineers arriving in Kerala to repair stranded F-35B jet

రానున్న 40 మంది నిపుణుల బృందం 

ప్రత్యేక టో వాహనాన్ని పంపిన యూకే

త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్‌ నేవీ యుద్ధ విమానం ఎఫ్‌–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్‌ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్‌ బ్రిటీష్‌ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్‌ స్నాగ్‌ కారణంగా ఉండిపోయిన ఎఫ్‌–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్‌ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది.

 ఫైటర్‌ జెట్‌ను భారత్‌లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్‌ కోసం బ్రిటన్‌ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్‌–35బి జూన్‌ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్‌కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. 

కానీ హైడ్రాలిక్‌ వైఫల్యంతో జెట్‌ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్‌ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్‌–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్‌లోని బ్రిటిష్‌ హైకమిషన్‌ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్‌ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. 

జోరుగా మీమ్స్‌ 
బ్రిటన్‌ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్‌లైన్‌లో జోరుగా మీమ్స్‌ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్‌ను కేవలం 4 కోట్లకే ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్‌కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్‌ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్‌ వైరలవుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement