చీలిక దిశగా ఉద్ధవ్ ‘శివసేన’
గైర్హాజరైన ఎంపీలపై అనర్హత వేటుకు పార్టీ యోచన
తిరుగుబాటు ఎంపీలకు వై–ప్లస్ భద్రత
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్టీలో చీలిక ఖాయమని స్పష్టమవుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా గురువారం ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. పార్టీకి చెందిన 9 మంది లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు కచ్చితంగా ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవ్వాలని అగ్రనాయకత్వం విప్ జారీచేయగా గురువారం నాటి సమావేశానికి ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు నగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాధవ్, సంజయ్ దినా పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్చౌరే రాలేదు.
కేవలం ముగ్గురు లోక్సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావూ వాజే, ఒక రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. మెజారిటీ ఎంపీల గైర్హాజరుపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈ ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీచేస్తాం. విప్ను ఉల్లంఘిస్తూ ఎందుకు సమావేశానికి డుమ్మా కొట్టారని కారణం అడుగుతాం.
స్పందన తెలియజేసేందుకు ఏడు రోజుల గడువు ఇస్తాం. స్పందించకపోతే వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తాం’’అని రౌత్ చెప్పారు. అయితే ఇప్పటికే ఆరుగురు రెబల్ ఎంపీలు స్పీకర్ను కలిసి ఒక లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో తమను కలిపేస్తూ, లోక్సభలో తమకు సీట్లు విడిగా కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.
‘‘ఈ నమ్మకద్రోహులను వదిలిపెట్టేదే లేదు. స్వస్థలాలు, సొంత నియోజకవర్గాల్లో వాళ్లను స్వేచ్ఛగా తిరిగనివ్వం. వాళ్లకు సరైన గుణపాఠం చెప్తాం. మా భయంతో వాళ్లు ఇళ్లకు చేరుకోవాలంటే ఆర్మీ సాయం తప్పదు. భద్రతకు వాయుసేన సాయం తప్పదు. దేశంలో ఇలాంటి పార్టీ ఫిరాయింపుల ఉదంతాలపై సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’అని అన్నారు.
రెబల్స్కు భద్రత పెంపు
అధికార పార్టీలోకి మారబోతున్నామనే ప్రకటన నేపథ్యంలో ఆ ఆరుగురు రెబల్స్కు మహారాష్ట్రలోని షిండే సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించింది. జూన్ 17వ తేదీ నుంచే ఆ ఆరుగురు ఎంపీలకు భద్రత పెంచుతున్నట్లు ఇంటెలిజెన్స్ కమిషనర్ శిరీష్ జైన్ పేరుతో ఉత్త్తర్వు వెలువడింది.
తలో రూ.10 కోట్లు తీసుకున్నారు
ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘‘విశ్వాసఘాతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. నమ్మక ద్రోహులైన ఎంపీల సంగతి తేలుస్తాం. వాళ్లను వేటాడేందుకు ఆపరేషన్ తుడ్వాను ఆరంభిస్తాం. రెబల్స్ ఇప్పటికే తలో రూ.15 కోట్లు అందుకున్నారు. తాజాగా మరో రూ.10 కోట్లు తీసుకున్నారు. ఢిల్లీలో భద్రత లేదనే భయంతో రాజస్థాన్కు వెళ్లిపోయారు. వాళ్లలో కాస్తయినా నైతికత ఉంటే తక్షణం ఎంపీలుగా రాజీనామా చేయాలి. ఎంపీ హోదా లక్షలాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల కష్టార్జితం’’అని రౌత్ అన్నారు.


