కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్‌: డ్యాష్‌ క్యామ్‌తో సీఈవో గుట్టు రట్టు | Udaipur Molestation Case, CEO Birthday Party And Dashcam Footage Is Key, CEO And Two Others Arrested | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్‌ : డ్యాష్‌ క్యామ్ ద్వారా సీఈవో గుట్టు రట్టు

Dec 26 2025 2:29 PM | Updated on Dec 26 2025 4:08 PM

Udaipur molestation molestation case CEO birthday party and dashcam footage is key

ప్రతీకాత్మక చిత్రం

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఉదయపూర్ సామూహిక అత్యాచార ఉదంతం కలకలం రేపింది. ఈ దురాగతానికి సంబంధించి అత్యంత దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కంపెనీ సీఈవో పుట్టినరోజు, లేట్-నైట్ పార్టీలో మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి చేశారు. బాధితురాలిని ఇంట్లో దింపుతామని నమ్మించి, మార్గమధ్యలో మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. డాష్‌క్యామ్ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.  

పుట్టిన రోజు పార్టీ తర్వాత ఇంటి దగ్గర దింపుతామని చెప్పి కంపెనీ సీఈవో మరో ఇద్దరితో కలిసి కదులుతున్న కారులో మహిళా ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో కంపెనీ సీఈవో జయేష్, మరో ఎగ్జిక్యూటివ్ గౌరవ్, అతని భార్య శిల్ప సహా ముగ్గురిని ఉదయ్‌ పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకుని, తరువాత స్థానిక కోర్టు రిమాండ్‌కు తరలించారు.

పోలీసుల ప్రకారం..  సీఈవో పుట్టిన రోజు సందర్భంగా శోభాగ్‌పురాలోని ఒక హోటల్‌లో రాత్రి 9 గంటల ప్రాంతంలో పార్టీ ప్రారంభమై దాదాపు తెల్లవారుజామున 1.30 గంటల వరకు కొనసాగింది. బాగా లేట్‌ అయింది కాబట్టి కారులో ఇంట్లో దింపుతామని ఆఫర్‌ చేశారు. దారి మధ్యలో సిగరెట్‌ను పోలిన మత్తు పదార్థాన్ని ఇచ్చారని బాధితురాలు ఆరోపించింది. అది తిన్న తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాననీ, అనంతరం తనపై కారులోనే అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చిన తరువాత చెవిపోగులు, ముఖ్యంగా లోదుస్తులు మాయం కావడం ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు ఆమెలో భయాన్ని రేపాయి. దీంతో కారు డాష్‌క్యామ్ ఫుటేజీలో పరిశీలించాక జరిగిన దారుణమంతా రికార్డ్ అయిందని గుర్తించింది.  

డిసెంబర్ 23న పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 21 తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ యోగేష్ గోయల్ తెలిపారు. బాధితురాలు లైంగిక వేధింపులకు గురయిన‌ట్టు వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించినట్టు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును అదనపు పోలీసు సూపరింటెండెంట్ మాధురి వర్మకు అప్పగించారు. దర్యాప్తును మరింతగా కొనసాగించడానికి పోలీసులు కారులో ఏర్పాటు చేసిన డాష్‌క్యామ్ నుండి ఆడియో, వీడియో రికార్డింగ్‌లను కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement