హలో... హలో.. 120 కోట్లు | Telecom services reach 85 percent of the population | Sakshi
Sakshi News home page

హలో... హలో.. 120 కోట్లు

Jun 25 2025 4:28 AM | Updated on Jun 25 2025 5:48 AM

Telecom services reach 85 percent of the population

జనాభాలో 85% మందికి టెలికం సేవలు

పదేళ్లలో 9 రెట్లు పెరిగిన నెటిజన్ల సంఖ్య

ఇంటర్నెట్‌ యూజర్లు 10 కోట్ల నుంచి 94 కోట్లకు

2025 ఏప్రిల్‌లో కొత్తగా 30 లక్షల టెలికం కనెక్షన్లు

ఇందులో మూడింట రెండొంతులు గ్రామీణులే 

తిండి, బట్ట, నీడ.. వీటి సరసన ఇప్పుడు ఫోన్ కూడా చేరిపోయింది. అంతలా మన జీవితంలో ఈ ఉపకరణం భాగమైంది. దీనికంతటికీ కారణం టెలికం సేవలు మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడమే. ఎంతలా అంటే ఏకంగా 120 కోట్ల మంది భారతీయులకు చేరువయ్యేలా! టెలికం చందాదార్ల సంఖ్య పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశం మనదే. – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా కొత్తగా 30 లక్షల మంది టెలికం చందాదారులు పెరిగారు. ఇందులో మూ­డింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాలవారే కావడం ఆసక్తికరమైన అంశం. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఏప్రిల్‌ గణాంకాల ప్రకా­రం మొత్తం చందాదారుల సంఖ్య 120.38 కోట్లకు చేరుకుంది. ఇక దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 85.19 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. టెలి సాంద్రత పట్టణాల్లోనే అధికం. ఇక్కడ 100 మంది జనాభాకు 131.46 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. 

గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 59.26. టెలి సాంద్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 94.77గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 276.75 ఉంటే, అత్యల్పంగా బిహార్‌లో 57.37 ఉంది. ఇంటర్నెట్‌ యూజర్లలో సగం వాటా రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో వైర్‌లెస్‌ వినియోగదారులు 8.24 కోట్లు కాగా, వైర్‌లైన్ కస్టమర్లు 41.12 లక్షల మంది ఉన్నారు.

పల్లెల్లో మోగుతోంది
గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ మోగుతోంది. అవును.. టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లు దశాబ్ద కాలంలో పట్టణాల్లో 8.7 కోట్లు పెరిగితే పల్లెల్లో 11.71 కోట్లు అదనంగా వచ్చి చేరారు. చందాదారుల విషయంలో పట్టణాలకు, పల్లెలకు అంతరం తగ్గుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్‌స్క్రైబర్స్‌ పెరుగుతున్నారన్న మాట. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో టెలిఫోన్ చందాదారులు పట్టణ ప్రాంతాల్లో 10 లక్షలు (0.16 శాతం) పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో 19.6 లక్షలు (0.37 శాతం) వృద్ధి చెందడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలకు టెలికం సేవలు విస్తృతం అవుతుండడమే ఇందుకు కారణం.

నెటిజన్స్ పెరిగారు
దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా టెలికం చందాదారుల సంఖ్య 20 శాతమే పెరిగింది. అంటే కొత్తగా 20 కోట్ల మంది తోడయ్యారు. అదే ఇంటర్నెట్‌ విషయంలో యూజర్ల సంఖ్య పెరిగిన తీరు చూస్తే ఔరా అనిపించక మానదు. 2015లో నెటిజన్ల సంఖ్య 10 కోట్లు మాత్రమే. 2025 ఏప్రిల్‌ 30 నాటికి బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్ల సంఖ్య 9 రెట్లు దూసుకెళ్లి ఏకంగా 94 కోట్లు దాటింది. 

చవక స్మార్ట్‌ఫోన్లు, టెలికం కంపెనీల మధ్య చవక టారిఫ్‌ల యుద్ధం.. వెరసి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ఈ స్థాయికి  చేరింది. 2015 ఏప్రిల్‌లో మొబైల్‌ ఇంటర్నెట్‌ యూజర్లు 8.5 కోట్లు, వైర్డ్‌ సబ్‌స్క్రైబర్స్‌ 1.5 కోట్లు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం వైర్‌లెస్‌ నెట్‌ వాడకందారులు 90 కోట్లు, వైర్డ్‌ చందాదారులు 4.14 కోట్లు.

» చైనాలో 170 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారు.
» భారత్‌లో మొత్తం టెలికం చందాదారుల సంఖ్య 120.38 కోట్లు
» ఏప్రిల్‌లో మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ దరఖాస్తులు 1.35 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement