
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మరోసారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ అనేది టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. ఎయిర్ ఇండియాను 2022లో తీసుకున్న టాటా గ్రూప్.. తాజా విమాన ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతటి ప్రాణనష్టం అనేది చాలా అపారమైన నష్టంగా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం టాటా గ్రూప్ ఉద్యోగులకు సుదీర్ఘ లేఖ రాశారాయన.
‘నిన్న(గురువారం, జూన్ 12) జరిగిన దుర్ఘటన అనేది మాటల్లో చెప్పలేనిది. ఆ దుర్ఘటనతో ఇంకా షాక్లోనే ఉన్నాం. ఒక్క ప్రాణంపోతేనే విషాదం అంటాం. మరి ఇంతమంది ప్రాణనష్టం జరిగితే ఏమనాలి. ఇది కచ్చితంగా అపారమైన ప్రాణనష్టమే. ఇది మా గ్రూప్ చరిత్రలో దుర్దినంగా మిగిలిపోతుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అన్ని స్వదేశీ, విదేశీ బృందాలకు మేము పూర్తిగా సహకరిస్తాం. అత్యంత పారదర్శకతతో దర్యాప్తునకు సహకారం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. తాము ఎయిర్ ఇండియాను తీసుకున్నప్పట్నుంచీ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
#AirIndiaFlightCrash | Tata Group Head Natarajan Chandrasekaran writes to his colleagues, "What occurred yesterday was inexplicable, and we are in shock and mourning. To lose a single person we know is a tragedy, but for so many deaths to occur at once is incomprehensible. This… pic.twitter.com/XboB94W6DG
— ANI (@ANI) June 13, 2025
కాగా, అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన విమానం గురువారం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఇందులో 242 మంది ఉండగా, 241 మంది మృత్యువాత పడ్డారు. ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడై తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ ప్రయాణికుడు.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పే పరిస్థితుల్లో లేడు.